11/01/2026
అక్షర జాతరకు ‘నీరాజనం’.. రికార్డు స్థాయిలో పుస్తకాల అమ్మకాలు!
38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్లో రూ. 1.57 కోట్ల ఆదాయం.. రూ. 1.31 కోట్ల ఖర్చు: నిర్వాహకుల వెల్లడి
హైదరాబాద్: భాగ్యనగరంలో అక్షర పండుగ దిగ్విజయంగా ముగిసింది. సోషల్ మీడియా యుగంలోనూ పుస్తక పఠనం తగ్గలేదని, చదువరులసంఖ్య అంతకంతకూ పెరుగుతోందని ఈ ఏడాది జరిగిన 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన నిరూపించింది. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో బుక్ ఫెయిర్ సొసైటీ ప్రతినిధులు ప్రదర్శన ముగింపు వివరాలను, సమగ్ర ఆదాయవ్యయాలను అధికారికంగా వెల్లడించారు.
చారిత్రాత్మక విజయం:
హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు, కవి యాకూబ్ మాట్లాడుతూ.. "పుస్తక పఠనం కనుమరుగవుతుందన్న వాదనలను ఈసారి వచ్చిన భారీ జనసందోహం పటాపంచలు చేసింది. లక్షలాదిగా తరలివచ్చిన యువతే తెలంగాణలో వస్తున్న జ్ఞానవంతమైన మార్పుకు నిదర్శనం" అని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టేలా ప్రాంగణానికి అందశ్రీ పేరుతో పాటు, వివిధ వేదికలకు అనిశెట్టి రజిత, కొంపెల్లి వెంకట్ గౌడ్ వంటి తెలంగాణ స్ఫూర్తిప్రదాతల పేర్లు పెట్టి నివాళి అర్పించామన్నారు.
రికార్డు స్థాయిలో అమ్మకాలు:
సొసైటీ కార్యదర్శి వాసు మాట్లాడుతూ.. 11 రోజుల పాటు సాగిన ఈ ప్రదర్శనలో సుమారు రూ. 8 కోట్లకు పైగా విలువైన పుస్తకాలు అమ్ముడయ్యాయని, ఇది ఒక రికార్డని తెలిపారు. దేశంలోనే మూడవ అత్యుత్తమ బుక్ ఫేర్గా హైదరాబాద్ ఎదిగిందని గర్వంగా ప్రకటించారు. 1200కి పైగా విద్యార్థులతో నిర్వహించిన 'బాలోత్సవ్' కార్యక్రమాలు, డిసెంబర్ 24న జరిగిన 'పుస్తక నడక' కార్యక్రమాలు ప్రజలలో విశేషమైన చైతన్యాన్ని నింపాయని వివరించారు.
భవిష్యత్తు లక్ష్యం:
లిటరరీ ఫెస్టివల్ హైదరాబాద్ బుక్ ఫేర్ను త్వరలో పూర్తిస్థాయి 'లిటరరీ ఫెస్టివల్'గా తీర్చిదిద్దుతామని సొసైటీ ఉపాధ్యక్షులు బాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది 'పుస్తకస్ఫూర్తి' చర్చాగోష్ఠుల్లో 300 మందికి పైగా సాహిత్యకారులు పాల్గొన్నారని, కొంపెల్లి వెంకట్ గౌడ్ వేదికపై రికార్డు స్థాయిలో 54 పుస్తకాలు ఆవిష్కృతమయ్యాయని వివరించారు. సామాజిక బాధ్యతలో భాగంగా చేపట్టిన 'పల్లెకు పుస్తకం' కార్యక్రమం ద్వారా సేకరించిన వేలాది పుస్తకాలను గ్రామాల్లోని గ్రంథాలయాలకు అందించామన్నారు. ఒకప్పుడు కేవలం వ్యాపారవేదికగా ప్రారంభమైన ఈ ప్రస్థానం, నేడు తెలంగాణ మేధోశక్తికి ప్రతీకగా మారిందని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.
ఆదాయవ్యయాల వివరాలు ఇలా ఉన్నాయి.
- ప్రదర్శనకు సంబంధించిన ఆర్థిక వివరాలను నిర్వాహకులు పారదర్శకంగా వెల్లడించారు:
- మొత్తం ఆదాయం: రూ. 1,57,85,840/- (స్టాళ్ల రుసుము, స్పాన్సర్లు, టికెట్లు తదితరాల ద్వారా).
మొత్తం ఖర్చు: రూ. 1,31,60,431/- (నిర్మాణం, పబ్లిసిటీ, మెయింటెనెన్స్ తదితరాలు). ఈ వివరాలన్నింటినీ త్వరలోనే అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు.
కార్యక్రమంలో కోశాధికారి పి. నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు బి శోభన్ బాబు, సంయుక్త కార్యదర్శులు, ఎం. సూరిబాబు, కార్యవర్గ సభ్యులు టి. సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు